Category: Entertainment

ర‌ష్మికా మజాకా!

అవ‌కాశం వ‌చ్చేంత‌వ‌ర‌కే అవస్థలు. ఒక్క‌సారి అవ‌కాశం గుమ్మం తట్టి, తదుపరి స‌క్సెస్ అయ్యామా  ఇక గారెల బుట్టలో పడ్డ చందమే. హీరోయిన్ల విష‌యంలో ఇది ఎన్నోసార్లు ఋజువు అయ్యింది. తాజాగా క‌న్న‌డ కథానాయకి  ర‌ష్మిక మంద‌న్నా పెద్ద మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. క‌న్న‌డ చిత్ర పరిశ్ర‌మ‌లో ల‌క్ష‌ల్లోనే పారితోషికం అందుకున్న ఈ భామ టాలీవుడ్‌కు మ‌కాం మార్చాక రేటు అమాంతం పెంచేసింది. తెలుగులో తొలి చిత్రం ‘ఛ‌లో’తో ప్రేక్ష‌కుల‌ను తన  బుట్ట‌లో వేసుకున్న ఈ భామ, ఆ త‌ర్వాత న‌టించిన ‘గీతా గోవిందం’ తో  బంప‌ర్ హిట్ కొట్టింది. దీంతో బ‌డా నిర్మాత‌ల ఆమె చుట్టూ క్యూ కట్టారు.

అలా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందెపుచ్చుకుంది . దీంతో ర‌ష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే గీతాగోవిందం స‌క్సెస్ వ‌ర‌కు ఆమె ఒక్క సినిమాకు రూ.50 ల‌క్ష‌లలోపే వ‌సూలు చేసింది. కానీ సంక్రాంతి బ‌రిలోకి దిగిన‌ మ‌హేశ్‌బాబు సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ విజ‌యంతో ర‌ష్మిక త‌న‌ రెమ్యూన‌రేష‌న్‌ను రెండు కోట్ల రూపాయ‌ల‌కు పెంచిందని వినికిడి‌. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న కొంద‌రు హీరోలు కూడా ఇంత పారితోషికం అందుకోక‌పోవ‌డం గ‌మనార్హం. కాగా ర‌ష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’, శ‌ర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో న‌టిస్తోంది.

బయట పడ్డ రహస్య బీచ్‌

ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రకృతి అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం, వాటిని చూసి అచ్చరవొందడం  కూడా మనకు అనుభవమే. అందులో కొన్ని అసామాన్యమయినవి  అపురూపమైనవిగా ఉంటాయి. అలాంటి కోవకే  చెందినది మెక్సికో లోని పశ్చిమ తీరానికి చెందిన మారియెట్‌ దీవుల్లో దాగిన రహస్య బీచ్‌. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్‌ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్‌ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించే వీలు కుదిరింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ, మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ రహస్య బీచ్‌ ఓ బిలం లోపల ఉన్నట్లుగా కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా టార్సిసియో స్వారెజ్‌ అనే వీడియో గ్రాఫర్‌ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్‌ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చాయి.

నేను ఎంతో లక్కీ: ఏంజెలీనా జోలీ

ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ఆరో ప్రాణం. భర్త బ్రాడ్‌ పిట్‌ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేసింది. ఏంజెలీనాకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్‌). మాడెక్స్‌–19 కొ, పాక్స్‌–16 కొ, జహారా–15 కూ.. దత్తత తీసుకున్న పిల్లలు. షిలా–14 కూ, నాక్స్‌–12 కొ, వివియన్‌–12 కూ.. జోలీకి, బ్రాడ్‌ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు పిల్లలు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్‌ ఏంజెలిస్‌లోని తమ సొంత లాస్‌ ఫెలిజ్‌ భవంతిలో క్వారెంటైన్‌లో ఉంటున్నారు. మాడెక్స్‌ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్‌. ఇప్పుడిక ఆన్‌లైన్‌ లోనే చదువు కొనసాగిస్తున్నాడు.

మిగతా ఐదుగురివీ యూఎస్‌ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్‌ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు చూసుకుంటూ ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ విడుదలైంది. ఆ ప్రమోషన్‌ ఈవెంట్‌లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్‌ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్‌ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ కూడా పిల్లల సినిమానే కాకుంటే యానిమేటెడ్‌. అందులోని ఒక పాత్రకు ఏంజెలీనా జోలీ వాయిస్‌ ఇచ్చారు.